Leopard Spotted on Srivari Mettu Route in Tirumala: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నడక మార్గంలోని 450వ మెట్టు వద్ద చిరుత పులి సంచారంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు టీటీడీ, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. ఉదయం 2 గంటల పాటు శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలను టీటీడీ నిలిపివేసింది. ఉదయం 8 గంటల నుంచి భక్తులను గుంపులుగుంపులుగా టీటీడీ అధికారులు పంపుతున్నారు. పిల్లలు ఉన్న వారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
తిరుమల భక్తులకు భయం లేదు: భక్తుల భద్రత కోసం టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులను చిరుత పులుల సంచారం ఎప్పటి నుంచో ఆందోళనకు గురి చేస్తోంది. చిరుతలు ఎక్కువగా ఎస్వీయూ, ఎస్వీ అగ్రికల్చర్, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ పరిసరాల్లో సంచరిస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి తిరుమల కాలిబాట మార్గంలోకి కూడా ప్రవేశిస్తాయి.