చిలకలూరిపేటలో ఉత్సాహంగా జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు

ETVBHARAT 2026-01-21

Views 1

Bull Competitions In Chilakaluripeta : ఎన్టీఆర్ వర్థంతితో మొదలై, మంత్రి లోకేశ్ పుట్టినరోజు వరకు 6 రోజులు ఘనంగా జాతీయస్థాయి ఎడ్ల పందేలు నిర్వహించిన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వాహకులను అభినందిస్తున్నట్టు మంత్రి సవిత తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలలో భాగంగా మూడోరోజు ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖల మంత్రి సవిత, ప్రభుత్వ చీఫ్ విప్​ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, అరిమిల్లి రాధాకృష్ణ, జీడీసీసీ ఛైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, స్వచ్ఛ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ పట్టాభి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడ్ల పందేల్లో గెలుపొందిన ఎడ్ల విజేతలకు మంత్రి బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వారు ఎడ్ల పందేలకు విచ్చేసిన రైతులు, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎప్పుడూ చూడని ఎడ్ల పందేలను చూడటానికి రావాలని ప్రత్తిపాటి తనను ఆహ్వనించారని, ఇక్కడకు వచ్చి చూశాక మా రాయలసీమలో కూడా ఇంతకంటే ఘనంగా ఎడ్ల పందేలు నిర్వహించాలనే ఆలోచన వచ్చిందని సవిత సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి రైల్ కనెక్టివిటీ, పోర్టుల కనెక్టివిటీ, ఎయిర్ పోర్టుల కనెక్టివిటీ, జాతీయ రహదారుల కనెక్టివిటీతో కూటమి ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని సవిత తెలిపారు. రాయలసీమను ముఖ్యమంత్రి చంద్రబాబు హర్టికల్చర్, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్​గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతాన్ని కూడా హర్టికల్చర్ హబ్​గా మారుస్తారన్నారు. 2019-24 సంవత్సరంలో రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదని, పరదాలు చాటున తిరిగారని, గాల్లో పోతున్నా కింద ఉన్న చెట్లను నరికించారని సవిత ఎద్దేవా చేశారు. ఇప్పడున్నది రైతుల పక్షపాత ప్రభుత్వమని, కాబట్టే రైతులకు సంతోషాన్నిచ్చే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో కోలాహాలంగా జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. చీఫ్​ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రం నట్టేట మునిగిందని, రైతులకు తీరని ద్రోహం జరిగిందని, ఒక్క అవకాశమని నమ్మించి మోసగించిన వారిని ప్రజలు చివరకు ఇంటికి పంపారన్నారు . కూటమి ప్రభుత్వం తప్పకుండా 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని, దానిలో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు. పల్నాడు జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని తాను, ప్రత్తిపాటి ఒక నిర్ణయానికి వచ్చామని, ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తామని జీవీ తెలియచేశారు. 

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS