Antarvedi Lakshmi Narasimha Swamy: నవ నరసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. గోదావరి సాగర సంగమ దివ్య క్షేత్రంలో స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో వివిధ ఘట్టాలు వైభవంగా నిర్వహించేందుకు అర్చకులు పూజా క్రతువు ప్రారంభించారు. ఈ కళ్యాణ వైభోగం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జరుగుతుంది. ఈనెల 29న స్వామి వారి తిరు కళ్యాణోత్సవం, 30న రథోత్సవం, ఫిబ్రవరి ఒకటో తేదీన చక్రస్నానం, రెండో తేదీన తెపోత్సవంతో స్వామివారి కల్యాణోత్సవాలు ముగుస్తాయి. అంతర్వేది త్రికోణాకారపు దీవిలో వెలసి ఉంది. ఈ పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. అతి ప్రాచీనమైన అంతర్వేది ఆలయంలో నరసింహ స్వామి లక్ష్మీ సమేతుడై కొలువు తీరారు. పురాణాల ప్రకారం కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్లి వస్తే చాలని అంటారు. అందుకే అంతర్వేది దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందింది. లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు.